నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి విడుదల చేశారు. ‘‘ఫలితాల్లో 86.35శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చినట్లు’’ ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన పాలిసెట్కు 1,60,329 మంది దరఖాస్తు చేయగా 1,43,592(89.56%) మంది ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. ఈ తరుణలో పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.