నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా గురువారం ముల్లన్పూర్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ బ్యాటర్ టిమ్ డేవిడ్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం డేవిడ్, పొలార్డ్ల లెవల్ 1 నేరం చేశారని BCCI తెలిపింది. దీంతో వారి మ్యాచ్ ఫీజులో ఒక్కొక్కరికి 20% జరిమానా విధించబడింది.
ముంబై మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 15 ఓవర్లో ఈ సంఘటన జరిగింది. ఈ ఓవర్ చివరి బంతికి పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ వైడ్ యార్కర్ను వేశాడు. అయితే ఈ బంతిని అంపైర్ వైడ్ బంతి ఇవ్వలేదు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ సైతం ఇది వైడ్ బంతి అని గ్రహించలేకపోయాడు. ఈ దశలో కెమెరా ముంబై డగౌట్ వైపుకు మళ్ళించాడు. అక్కడ హెడ్ కోచ్ మార్క్ బౌచర్.. సూర్యకుమార్కి అది వైడ్ అని సైగ చేస్తూ కనిపించాడు. టిమ్ డేవిడ్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్తో కలిసి సూర్యను రివ్యూ తీసుకోమని సూచించారు. డగౌట్ నుంచి సైగ రావడంతో సూర్య రివ్యూకు వెళ్ళాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ వైడ్ ఇచ్చాడు. దీంతో అర్షదీప్ సింగ్ మరో బంతిని వేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం పంజాబ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ సామ్ కుర్రాన్ను చాలా నిరాశపరిచింది. “డేవిడ్, పొలార్డ్ IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డారు. ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించడంతో తమ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు.