నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులు ఏంటని ప్రశ్నించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మద్యం కేసులో కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినందున ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం.. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆచరణాత్మక ఇబ్బందులు ఉండవచ్చు.. కానీ, సీఎంగా కొనసాగడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకి ఏంటని పిటిషనర్ను ప్రశ్నించింది.