నవతెలంగాణ – మహబూబ్నగర్: తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందని ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలిపారు. నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతోందని మాజీ ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని బిఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు.