నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛరణాల మధ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాల్ జిల్లా పార్టీ ఇంచార్జి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అంబ్రహం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, శాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మరికాసేపట్లో గద్వాల్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం అయిజ రోడ్డులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.