నవతెలంగాణ-ఆత్మకూర్ఎస్
గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటేందుకు శనివారం స్థల సేకరణ పరిశీలించి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన ఆత్మకూర్ ఎస్ మండలం దాచారం గ్రామ సర్పంచ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మహ్మద్ అలీ (51)హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మహమ్మద్ అలీ కొంతకాలంగా సూర్యాపేటలో నివాసముంటూ గ్రామపంచాయతీకి రోజు వచ్చి వెళ్తుంటారు.జూన్లో ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమానికి మొక్కలు నాటేందుకు గాను కాల్వగట్లు, ప్రభుత్వ భూములు పరిశీలన చేసి ఇంటికి వెళుతుండగా చివెంల మండలం లక్ష్మీనాయక్తండా సమీపంలో పెట్రోల్ కోసం తన స్కూటీతో బంకులోకి వెళ్తుండగా సూర్యాపేట నుండి పల్సర్ బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు అతివేగంగా వచ్చి సర్పంచ్ మహమ్మద్ అలీ స్కూటీని ఢకొీట్టారు.ఈ ప్రమాదంలో సర్పంచ్తో పాటు పల్సర్ బైక్పై ఉన్న బానోత్ తరుణ్ ఆకాష్ ధరావత్ విష్ణులకు గాయాలయ్యాయి. గాయాలైన నలుగుర్ని సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నలుగుర్ని హైదరాబాద్కు తరలించారు.ఉస్మానియాలో చికిత్స పొందుతున్న సర్పంచ్ మహమ్మద్ అలీ ఆదివారం ఉదయం మృతి చెందారు.గాయపడిన యువకులు తరుణ్,ఆకాశ్లు హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ చికిత్స పొందుతుండగా విష్ణు ఎల్బీనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పల్సర్ బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులలో బానోతు తరుణ్,ఆకాశ్ లు మిర్యాలగూడ మండలం బొట్యనాయక్తండాకు చెందిన వారు కాగా ధరావత్ విష్ణు పెన్పహాడ్ మండలం జగ్గుతండాకు చెందిన వాడు.వీరు ముగ్గురు మిత్రుడి వివాహం కోసం శుభలేఖలు పంచుతూ ఆత్మకూరు ఎస్ మండలం రామోజీతండాలో భానోతు రమేష్ ఇంట్లో శుభకార్యానికి హాజరై అక్కడి బంధువులకు శుభలేఖలు పంపిణీ చేసేందుకు వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం సంభవించింది.
వివాదరహితుడు మహమ్మద్ అలీ
కమ్యూనిస్టు ఉద్యమాల్లో సుమారు 25 ఏండ్లుగా పనిచేసి చంద్రబాబునాయుడు హయాంలో టీడీపీ 10 ఏండ్లు ఉన్నారు.అనంతరం మహమ్మద్ అలీ ఎనిమిదేండ్ల కింద కాంగ్రెస్లో చేరి 2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో అత్యధికఓట్లతో విజయం సాధించారు.సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలోనూ మంచి గుర్తింపు ఉన్న మహమ్మద్అలీ మూడేండ్లలోనే నాలుగుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు.ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన మహమ్మద్ అలీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు అతిజాగ్రత్తగా ఉండే మహమ్మద్ అలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.దాచారం గ్రామపంచాయతీ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో తనకున్న విలువైన వ్యవసాయ భూమిని అమ్మి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.
పలువురి పరామర్శ
కాంగ్రెస్ సీనియర్ నాయకులు,సర్పంచ్ మహమ్మద్ అలీ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు చెవిటి వెంకన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొప్పులవేణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మహమ్మద్అలీ మరణ వార్త తెలుసుకుని వారు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలేసినివాళులర్పించారు.మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు.మృతునికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.