– అవినీతికర, నిరంకుశ బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించండి
– ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి: సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్
”ఫాసిస్టు బీజేపీని ఓడించండి.. అవినీతికర, నిరంకుశ బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించండి.. ఇండియా కూటమి బలమైన అభ్యర్థులకు ఓటువేసి గెలిపించండి” అని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్లోని మార్క్స్ భవన్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామయ్య మాట్లాడుతూ.. కార్మికులు, రైతాంగం, మహిళలు, దళితులు, ట్రైబల్స్, ప్రత్యేకంగా ముస్లింల హక్కులపైనా, రాష్ట్రాల హక్కులపైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాడులు చేస్తోందన్నారు. ఫాసిస్టు రాజ్యాన్ని ఏర్పరచే ప్రమాదం ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ చరిత్రను వక్రీకరిస్తూ, ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నికలు, ఒకే నాయకుడు, ఒకే పార్టీ దేశంగా హిందూత్వ పేరిట, దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రచారం సాగిస్తోందని చెప్పారు. మీడియాను గుప్పిట్లో పెట్టుకొని మోడీ గ్యారంటీ పేరిట మరోసారి ప్రజా ద్రోహానికి పూనుకుంటోందన్నారు. ఇక తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో, త్యాగాలు చేసి, సాధించుకున్న తెలంగాణా 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో అప్పులకుప్పగా మారిందన్నారు. అవినీతి, నిరంకుశ పాలన పరాకాష్టకు చేరి ఇంటిదారి పట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి అవినీతి కుంభకోణంగా మారిందన్నారు. కుటుంబ పాలన రాజ్యమేలిందన్నారు. మరోవైపు మోడీ ప్రభుత్వంతో అంటకాగిందని, ఇప్పటికీ లోపాయికారీ కుమ్మక్కు కొనసాగుతూనే ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ నిజరూపాన్ని అర్థంచేసుకొని ఆ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లోనూ తిరస్కరించాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ట్రైబల్స్ హక్కులపై ఉద్యమిస్తున్న ఉపాధ్యాయురాలు, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు టి.శ్రీనివాస్, నాయకులు జె.వి.చలపతిరావు, ఆవునూరి మధు ఉన్నారు.