రాజన్న ఆలయ అధికారుల ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు..

– ఎప్పుడేం ఏ వార్త వినాల్సి వస్తుందో ఆందోళనలో అధికారులు..
– నూతన కమిషనర్ కొరడా..
నవతెలంగాణ వరస కథనాలకు స్పందించిన కమిషనర్..
– 14 మందిలో 13 మందిపై చర్యలు..
– మరొకరు ఎవరంటూ  చర్చ?
నవతెలంగాణ – వేములవాడ
రాజన్న క్షేత్రంలో జరుగుతున్న అవినీతి ,అక్రమార్జన బహుముఖ రూపాల్లో రాజన్నకే మహిమలు చూపిస్తున్న అధికారులు ఉద్యోగుల పై నవ తెలంగాణ దినపత్రికలో ప్రత్యేక కథనాలు 11-12-2023న రాజన్న ఆలయంలో నకి “లీలలు”,16-12-2023 న మరోసారి,22-12-2023 న రాజన్న కోడెలు భద్రమేనా..!,24-12-2023 న రాజన్న ఇదేందయ్యా..?25-01-2024 న వేలం రద్దు వెనకాల రహస్యం ఏంది..?, 25-02-2024 న బీరువాలో దాచిన రహస్యం అనే కథనాలను ప్రచురించింది.. ఈ కథనాలకు స్పందించిన దేవాదాయ- ధర్మాదాయ కమిషనర్ హనుమంతరావు చర్యలకు ఆదేశించారు. తెలంగాణకే తలమానికంగా వెలుగొందుతున్న శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏ చిన్న సంఘటన జరిగిన  అది పెను సంచలనమే.. అలాంటిది గురువారం ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 13మందిపై  ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు,రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలగజేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు  ఏ.ఈ.వోలు, నలుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, మరో ఇద్దరు వ్యక్తుల సేవల సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం 14 మందిపై చర్యలు తీసుకున్నారంటూ వినబడిన మరొకరి ప్రస్తావన రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా ప్రసాదాల తయారీ పర్యవేక్షకుడికి దేవాలయ ఖాతాలో డబ్బులు జమ చెయ్యాలని ఆదేశించడంతో అవినీతి అధికారుల సిబ్బంది గుండెలు గుబెల అనేలా, రాజన్న ఆలయ అధికారులు, సిబ్బందిపై చర్యలు   చర్చనీయాంశంగా మారాయి.
విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు..
గుడిలో లింగాన్ని  మింగే ఘన పాటిలు ఉన్న  ఆలయ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల ఎదుర్కొంటున్న 13మంది ఆలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఎంతోమందిపై నిఘా కొనసాగడం, చాలా మంది ఉద్యోగులు, సిబ్బందిపై నిత్యం అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతుండటంతో ఇందులో తమ పేర్లు ఉంటాయేమోనని, ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని  కొంతమంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు దేవాలయంలో చర్చ జరుగుతుంది. ఇంటి దొంగలు ఎవరంటే భుజాలు తడుముకునే పరిస్తితి నెలకొంది.
2021లోనే విజిలెన్స్ విచారణ..
వాస్తవానికి ఈ 13మంది ఉద్యోగులకు సంబంధించి 2021లోనే విజిలెన్స్ విచారణ పూర్తయింది. కానీ నివేదిక ఫైల్ అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ వద్ద పెండింగ్ లో ఉండటం, సదరు ఉద్యోగులకు అప్పటి బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఫైల్ ముందుకు కదలలేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే వీరిపై చర్యలు తీసుకోవడం వీలు పడలేదనే వాదనలు లేకపోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిందో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సీఎం రేవంత్ రాజన్న దేవాలయ అభివృద్ధిపై దృష్టి సారించారో ఇక అప్పటి నుండి ఆలయానికి మంచి రోజులు వచ్చాయనే పట్టణ ప్రజలు, భక్తులు అనుకుంటున్నారు.  అదే సమయంలో గత ప్రభుత్వంలో   కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్ ను ఇతర శాఖకు బదిలీ చేసి హనుమంతరావును నూతన కమిషనర్ గా నియమించారు. దీంతో ఆప్పటి పెండింగ్ ఫైల్ లు అన్ని  ఇప్పుడు ముందుకు వస్తున్నాయని, రాజన్న ఆలయ ఫైల్ ముందుకు రాగా దీనిపై   ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వినికిడి. దీనికి తోడు కమిషనర్ హనుమంతరావు వేములవాడ పర్యటనకు వచ్చిన మూడు రోజుల్లోనే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం పై వాదనలకు బలంగా వినిపిస్తున్నాయి.
మరో కొత్త చర్చ..
13మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్న మరుక్షణమే ఇక్కడ మరో కొత్త చర్చ మొదలైంది. ఆనాడు విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికలో మొత్తం 14మంది పేర్లు ఉండగా, ఇప్పుడు చర్యలు తీసుకున్న వారిలో 13మంది పేర్లు మాత్రమే ఉన్నాయని, చర్యలు తీసుకోని మిగతా ఆ ఒక్కరు ఎవరు అంటూ మరో చర్చ.  మిగిలిన ఆ ఒక్క వ్యక్తి ఆలయ ఈ.ఓ కృష్ణ ప్రసాద్ అంటూ ఆలయ ఉద్యోగుల్లో బహిరంగంగానే  గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  బయట వినిపిస్తున్న ఆ 14వ అధికారి ఈ.వోనే అనే వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏదిఏమైనాప్పటికీ ఆలయ అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం మంచి పరిణామమే..
Spread the love