నవతెలంగాణ-హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసువారే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్లు ఒకే ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ బస్సు హనుమకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభకు ప్రజలను తరలించి తిరిగి ఖాళీగా వెళుతోంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిలో గణేశ్ బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం విందు చేసుకొని ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి ఇళ్లకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు నలుగురు విద్యార్థులు సుమారు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు. వీరంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు. ఇల్లంద గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం.. రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.