ఆద్యంతం వినోద భరితం..

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్‌లైట్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, మురళికష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘నాలో నేనే లేను’ లిరికల్‌ వీడియోకి సైతం అద్భుత రెస్పాన్స్‌ రావడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. తన ప్రేమను కథానాయికకి చెప్పడం కోసం కథానాయకుడు పడే తపనని ఈ పాటలో అద్భుతంగా చూపించారు. అమ్రిష్‌ గణేష్‌ స్వరపరిచిన సంగీతం వినసొంపుగా, ఆహ్లాదకరంగా ఉంది. సంగీతానికి తగ్గట్టుగానే రాంబాబు గోసాల అందించిన సాహిత్యం ఎంతో హాయిగా, స్వచ్ఛంగా ఉంది. అందరికీ అర్ధమయ్యే భాషలో ఎంతో అర్థవంతంగా పాటను రాశారు.
ఇక శరత్‌ సంతోష్‌ ఎంతో అందంగా పాటను ఆలపించారు. ఇవన్నీ ఈ పాటను ప్రేక్షకులకు చేరవయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించాయని మేకర్స్‌ తెలిపారు.
గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో ‘నాలో నేనే లేను’ అనే పాట రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా దర్శకులు రత్నం కష్ణ చాలా మంచి సందర్భాన్ని వివరించారు. చాలా అందమైన చిన్న చిన్న పదాలతో తన ప్రేమని కథానాయికకి తెలియజేయడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చెప్పాం. అలాగే చరణాలను కవితాత్మకంగా చెప్పాం. అందరూ అదరించి ఈ పాటను పెద్ద హిట్‌ చేశారు. అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. హీరో కిరణ్‌ అబ్బవరం గత చిత్రాలకు, ఇమేజ్‌కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటంతో పాటు, పూర్తి స్థాయి వినోదభరిత కథాచిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు.

Spread the love