తెలంగాణలో 12 సీట్లు ఇవ్వండి: అమిత్ షా

నవతెలంగాణ – హైదరాబాద్: మెదక్ నుంచి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బీజేపీ కనీసం 12 లోక్ సభ స్థానాల్లో గెలిపించాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జనసభ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అయోధ్యలో రామమందిరం కోసం ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు మోదీ ఎంతో చేశారన్నారు. తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉందన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ వచ్చాక సెప్టెంబర్ 17న తప్పకుండా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ పదేళ్ల కాలంలో దేశంలో ఎన్నో సమస్యలను పరిష్కరించామని… జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించామని చెప్పారు. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారని ఆరోపించారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తామన్నారు. సమగ్ర తెలంగాణ వికాసం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.

Spread the love