నవతెలంగాణ-హైదరాబాద్ : ఇటీవల విడుదలైన ఉత్తరప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన ప్రాచీ నిగమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 600లకు గాను 591 మార్కులు సాధించి, 98.5 శాతంతో టాపర్గా నిలిచింది. కానీ, ఆమె ప్రతిభను ప్రశంసించడానికి బదులు కొందరు ఆమె అందంగా లేదంటూ విమర్శించారు. ప్రాచీ ముఖంపై అవాంఛిత రోమాలుండడమే ఆమెపై ట్రోలింగ్కు కారణం. ఈ బాడీ షేమింగ్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే, తన ముఖంపై అవాంఛిత వెంట్రుకలపై ట్రోల్ చేస్తున్న ట్రోలర్లపై ప్రాచీ నిగమ్ ఎట్టకేలకు స్పందించింది. “ట్రోలర్లు వారి ఆలోచనలతో వారు ఉంటారు. నా విజయం పట్ల నేను ఆనందంగా ఉన్నాను. నా విజయం వల్ల నాకు ఇప్పుడు దక్కిన గుర్తింపుతో సంతోషంగా ఉన్నాను” అని ఆమె బుధవారం అన్నారు. ఇంకా ప్రాచీ నిగమ్ మాట్లాడుతూ.. “నా కుటుంబం, నా ఉపాధ్యాయులు, నా స్నేహితులు నా రూపాన్ని ఎన్నడూ విమర్శించింది లేదు. దాని గురించి నేను ఎప్పుడూ బాధపడలేదు. పదో తరగతి ఫలితాల తర్వాత నా ఫొటో ప్రచురితమైనప్పుడు మాత్రమే కొందరు నన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆపై నా దృష్టి ఈ సమస్యపైకి మళ్లింది. ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. అంతిమంగా ముఖ్యమైనది నా మార్కులే తప్ప నా ముఖం మీద వెంట్రుకలు కాదు” అని ఆమె చెప్పుకొచ్చారు.