– మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
– కొనసాగిన రెజ్లర్ల ఆందోళన
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళన గురువారం నాటికి 33 రోజులు పూర్తి చేసుకుంది. ఈనెల 28న కొత్త పార్లమెంట్ ఎదుట దేశ మహిళా క్రీడాకారులు తలపెట్టిన మహాపంచా యత్కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీతో సహా ఇతర రాష్ట్రాల్లో ఆటగాళ్లు వేగంగా ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. మహాపంచాయత్కు దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్తో సహా అనేక మంది అంతర్జాతీయ రెజ్లర్లు గురువారం హర్యానాలోని జింద్-నర్వానా జాతీయ రహదారి ఖట్కర్ టోల్ ప్లాజా వద్ద కిసాన్ పంచాయతీలో పాల్గొన్నారు. నిందితుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని రెజ్లర్లు పేర్కొన్నారు. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అహంకారంతో ఉందన్నారు. న్యాయం చేయాలంటూ దేశంలోని ఆడబిడ్డలు వీధుల్లో తిరుగుతుంటే చూడలేకపోవ డానికి ఇదే కారణమని అన్నారు. క్రీడాకారుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించ కుంటే రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక తరహాలోనే బీజేపీ పరిస్థితి ఉంటుందని అన్నారు. ఈ పోరులో కచ్చితంగా విజయం సాధిస్తామని రెజ్లర్ బజరంగ్ పునియా అన్నారు. 28న పార్లమెంట్ ఎదుట జరిగే మహాపంచాయతీకి మహిళలు, యువత అత్యధికంగా చేరుకోవాలని భజరంగ్ అన్నారు. పూర్తి శాంతి, క్రమశిక్షణతో పాల్గొనాలని సూచించారు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ మాట్లాడుతూ తాను పతకం తెచ్చినప్పుడు ఇక్కడ కూతుళ్లకు ఎంతో గౌరవం ఉందని, కానీ ఇప్పుడు వీధిలో కూర్చునే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన బలమైన ప్రజాప్రతినిధి కావడం వల్లే తనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారని విమర్శించారు. ఇది త్రివర్ణ పతాక వైభవం కోసం జరుగుతున్న పోరాటమని అన్నారు. కుస్తీ మాత్రమే కాదు, అన్ని క్రీడల్లోనూ బ్రిజ్ భూషణ్ లాంటి వారు ఉన్నారని, వారందరినీ ఏరివేయాలని, ఇందుకోసం బాధితులు ముందుకు రావాలని అన్నారు. 9053903100 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో దేశంలోని ప్రతి మహిళ ఈ పోరాటంలో తమ గళాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు.