– నినాదాల తొలి గళం ఇద్దరు ముస్లింలదే…
-‘సంఫ్’ ఆ నినాదాలు వదిలేస్తుందా?
– ప్రశ్నించిన కేరళ సీఎం విజయన్
తిరువనంతపురం : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను మొదట చేసింది ఇద్దరు ముస్లింలనీ, ఇప్పుడు ఆ నినాదాలను వదిలేయడానికి సంఘ పరివార్ సిద్ధంగా వుందా అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. ముస్లింలు ఎక్కువగా వుండే ఉత్తర కేరళ జిల్లాలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లిం పాలకులు, సాంస్కృతిక ప్రముఖులు, అధికారులు గణనీయ పాత్ర పోషించారన్నారు. ఇందుకు సంబంధించి చరిత్రలోని ఉదాహరణను ఆయన చెప్పారు. అజీముల్లా ఖాన్ అనే ముస్లిం తొలుత భారత్ మాతా కీ జై అనే నినాదం చేశారని గుర్తు చేశారు. ”ఇక్కడకు వచ్చిన సంఘ పరివార్ నేతలు తమ ముందు కూర్చున్నవారిని చూసి భారత్ మాతా కీ జై అని నినదించమంటున్నారు. అసలు ఎవరు ఈ నినాదం ఇచ్చారు? ఈ నినాదం మొదట చేసింది ముస్లిం అని, ఆ వ్యక్తి పేరు అజీముల్లా ఖాన్ అని సంఘ పరివార్కు తెలుసో లేదో నాకు తెలియదు.” అని విజయన్ వ్యాఖ్యానించారు. ముస్లిం అని తెలిస్తే వారు ఈ నినాదం చేయడం ఆపేస్తారేమో మరి అది కూడా తెలియదని అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నిర్వహిస్తున్న ర్యాలీల్లో భాగంగా సోమవారం నిర్వహించిన నాల్గవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రాచీన దౌత్యవేత్త అబిద్ హసన్ అనే వ్యక్తి తొలుత జై హింద్ అనే నినాదం చేశారన్నారు. మొఘల్ పాలకుడు షాజహాన్ కుమారుడు దారా షికా సంస్కృతంలో నుంచి పర్షియన్ భాషలోనికి 50 ఉపనిషత్లను అనువాదం చేశారని, ప్రపంచవ్యాప్తంగా వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారని విజయన్ పేర్కొన్నారు. ముస్లింలు భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని వాదిస్తున్న సంఘ పరివార్ నేతలు, కార్యకర్తలందరూ ఈ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలన్నారు. ఇతరులందరితో కలిసి ముస్లింలు కూడా ఈ దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.