మార్క్‌.. అలియాస్‌ మార్కండేయులు

మామా అల్లుళ్ళ ద్వయం పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి.సముద్రఖని దర్శకుడు. దర్శకులు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు.
అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్‌కళ్యాణ్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సాయి ధరమ్‌ తేజ్‌ పాత్రకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.
‘బ్రో’ చిత్రంలో మార్క్‌ అలియాస్‌ మార్కండేయులు అనే పాత్రలో సాయి ధరమ్‌ తేజ్‌ కనువిందు చేయనున్నారు. బుధవారం సాయంత్రం 4:14 గంటలకు మార్క్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. తెల్లటి దుస్తులు ధరించి ఫస్ట్‌లుక్‌లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు సాయి తేజ్‌. మోషన్‌ పోస్టర్‌లో గడియారాన్ని చూపిస్తూ మార్కండేయులుగా సాయితేజ్‌ పాత్రను పరిచయం చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం’ అనే శ్లోకం వినిపిస్తుండగా శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో సాయి తేజ్‌ పాత్రను పరిచయం చేయడం మెప్పిస్తోంది. ఈనెల 18న ‘బ్రో’ టైటిల్‌ని ప్రకటిస్తూ పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. ”కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం..’ అనే శ్లోకంతో పవన్‌ కళ్యాణ్‌ పాత్రను పరిచయం చేసిన తీరు కట్టిపడేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మోషన్‌ పోస్టర్‌ అత్యధిక వీక్షణలతో సోషల్‌ మీడియాలో సంచలన రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది.
ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల విడుదల కానుంది.

Spread the love