బ్రిజ్‌ భూషణ్‌పై సాక్ష్యాలు సేకరించిన పోలీసులు!

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను ఢిల్లీ పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. ఆయనపై ఆరుగురు మహిళలు ఫిర్యాదు చేయగా, నలుగురి ఫిర్యాదుల్లో ఫొటో సాక్ష్యాలు, ముగ్గురి ఫిర్యాదుల్లో వీడియో సాక్ష్యాలు ఉన్నట్టు సమాచారం. ఈ కేసుల్లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన 1,500 పేజీల ఛార్జిషీటులో ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్టు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా 200 మందికిపైగా సాక్షుల స్టేట్‌మెంట్లను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. బాధితుల ఆరోపణలకు బలం చేకూర్చే స్టేట్‌మెంట్లను ఛార్జిషీటులో పొందుపరచి, కోర్టుకు సమర్పించారు. 100 స్టేట్‌మెంట్లు ఈ ఆరోపణలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఫొటోలు, వీడియోలు, కాల్‌ రికార్డులు వంటి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ (సాంకేతిక ఆధారాలు)ను కూడా కోర్టుకు సమర్పించారు. దీనిపై కోర్టు విచారణ ఈ నెల 22న జరుగుతుంది.డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయం, టోర్నమెంట్లు, క్యాంపులు, ఇతర కార్యక్రమాలు జరిగేటపుడు తమపై బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మహిళా రెజ్లర్లు ఆరోపించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పతకాలు పొందిన సందర్భంగా జరిగిన కార్యక్రమాలు, గ్రూప్‌ ఫొటోలు తీసుకున్న సందర్భా ల్లో తీయించుకున్న ఫొటోలు, వీడియోలను ఫిర్యాదుదారులు సమర్పించారని తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలు, టోర్నమెంట్‌ రిఫరీలు, సిబ్బంది, కో-పార్టిసిపెంట్ల స్టేట్‌మెంట్లను కూడా ఛార్జిషీటులో పొందుపరచినట్టు తెలిపారు.
రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలి
ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ తదితరులు నిరసన తెలుపుతున్న సమయంలో మే 28న జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో రెజ్లర్లకు వ్యతిరేకంగా నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

Spread the love