విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా సమరభేరి జీపు యాత్రలు

– ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలో జీపు యాత్ర ప్రారంభం 
– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంత్  
నవతెలంగాణ – వీర్నపల్లి 
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సమరభేరి జీపు యాత్రలు నిర్వహిస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బుధవారం జిపు యాత్రను అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి ప్రారంభించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశాయాల సాధనకై ముందుకెళ్తామని అన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిందని అందుకే ప్రభుత్వ పాఠశాలలో, సంక్షేమ హాస్టల్లో గురుకులాలు కేజీబీవీ విద్యాసంస్థలు జూనియర్ కాలేజీలో సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు . ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీల నిలబెట్టుకోవడం లో వైఫల్యం చెందిందని అన్నారు. తక్షణమే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పెరిగిన ధరల అనుకూలంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటికీ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తో విద్యారంగాన్ని పేద వర్గాలకు దూరం చేస్తుందని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైందని విద్యలో శాస్త్రీయమైనటువంటి దృక్పథానికి తూట్లు పొడిచే విధంగా ఉందని పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగాలు కల్పించడంలో వైఫల్యం చెందాయాన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ దొంగ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విద్యారంగం సమగ్ర అభివృద్ధి కోసం ఎస్ఎఫ్ఐ సమరభేరి జీపు యాత్రను చేస్తుందని ఐదు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమరభేరి జీపు యాత్ర జయప్రదం కోసం విద్యార్థులు ఉపాధ్యాయులు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమరభేరి జీపు యాత్ర ద్వారా వచ్చిన సమస్యలను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు ఆ తర్వాత సమస్యల పరిష్కారం కాకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా నాయకులు వేణు, ఆదిత్య, రామ్ చరణ్, అభిషేక్, సంతోష్, నాగరాజు, సాయి చరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love