మార్చిలోనే భయపెడుతున్న ఎండలు

నవతెలంగాణ హైదరాబాద్: ఎండలు మార్చి ప్రారంభంలోనే మండిపోతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో రోజువారీ కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే రోజు 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఏపీలో పశ్చిమ, దక్షిణ రాయలసీమ ప్రాంతాలు, పశ్చిమ తెలంగాణల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. మార్చి నుంచి మే వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది.
ముఖ్యంగా వేడి తీవ్రత గత ఏడాది కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నది. మార్చి నుంచి మే వరకు జమ్మూకాశ్మీర్‌, తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో హీట్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచించింది. ఎల్‌-నినో ప్రభావంతో ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్నది. దీని ప్రభావం నిరుడు జూలై నుంచి కొనసాగుతుండగా, వర్షాకాలంలో కరువు వచ్చింది. 2023 ఆగస్టులో వందేండ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొన్నది. గత జనవరిలోనూ వర్షాలు పడలేదు సరి కదా శీతాకాలంలో దేశంలోని పలు రాష్ర్టాలు చలితో వణికిపోయాయి. ఏప్రిల్‌ నాటికి ఎల్‌-నినో ప్రభావం ముగియనున్నదని అమెరికా నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ క్లైమేట్‌ ప్రిడిక్షన్‌ సెంటర్‌ (ఏఎన్‌వోఏఏసీపీసీ) తెలిపింది.

Spread the love