తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు

– ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లాలోనూ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు
– రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల భవన్‌లో 1967, 1800 4250 0333 ఏర్పాటు: వి.అనిల్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు వచ్చిన తరువాత తాలు పేరుతో తరుగు తీయకూడదనీ, తేమ తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమీషనర్‌ వి.అనిల్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాలు, తరుగుపై పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను నివేదించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయనీ, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం దిగుమతికి మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా తక్షణం దించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రైతులు ఒకేసారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా ఒక క్రమ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం (తేమ శాతం 17 లోపు) ఉండే విధంగా ఆరబెట్టి తాలు లేకుండా తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు అమ్ముకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా కొనుగోలు జరపాలని ఆదేశించారు. లారీలు హామాలీల కొరత లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా ధాన్యం కొనుగోలుకు సంబంధం ఉన్న వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార తదితర విభాగాలతో క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
తాలు తరుగు పేరుతో మిల్లర్లు నుంచి ఎదురవుతున్న సమస్యలతో పాటు ధాన్యం కొనుగోలు, ధాన్యం రవాణా, కనీస మద్ధతు ధర తదితర ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని ఫౌరసరఫరాల భవన్‌లో 1967, 1800 4250 0333 టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Spread the love