న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు ‘సుప్రీం’ నోటీసులు

న్యూఢిల్లీ :  న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపక చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్త, హెచ్‌ఆర్‌ విభాగం చీఫ్‌ అమిత్‌ చక్రవర్తి తమ ఇటీవల అరెస్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) కింద ఢిల్లీ పోలీసులు తమను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌న్లను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసును అత్యవసర విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ముందు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రస్తావించారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చినప్పుడు, ధర్మాసనం ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను కోరుతూ రెండు పిటిషన్లకు సంబంధించి నోటీసు జారీ చేసింది. పిటిషనర్ల తరపున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. ‘అరెస్టుకు సంబంధించిన ఆధారాలను రాతపూర్వకంగా అందించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన పంకజ్‌ బన్సల్‌ తీర్పును విస్మరించారు. అరెస్టు మెమో చూడండి. ఏమీ అందించబడలేదు’ అని పేర్కొన్నారు. జస్టిస్‌ గవారు జోక్యం చేసుకుని ‘సెలవు ముగిసిన వెంటనే మేము ఈ పిటిషన్‌ను తీసుకుంటాం’ అని చెప్పారు. ‘వైద్య కారణాలపై మధ్యంతర ఉత్తర్వులు కోసం ఒక దరఖాస్తు కూడా ఉంది. పిటిషనర్‌ పుర్కాయస్థ వయసు 71 ఏళ్లు’ అని కపిల్‌ సిబల్‌ తెలిపారు. ప్రధాన పిటిషన్లతోపాటు మధ్యంతర ఉపశమనం కోసం దాఖలు చేసిన దరఖాస్తును కూడా అదేరోజు విచారిస్తామని జస్టిస్‌ గవాయి  తెలిపారు.
నిరసనలు విజయవంతంపై ఎఐకెఎస్‌ అభినందన
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపు మేరకు న్యూస్‌క్లిక్‌ మీడియా సంస్థపై జరిగిన అన్యాయమైన దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను విజయవంతం చేసినందుకు రైతులను అఖిలభారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అభినందించింది. ‘న్యూస్‌క్లిక్‌పై ఎఫ్‌ఐఆర్‌లో రైతుల ఉద్యమం దేశ వ్యతిరేకమని, విదేశీ, తీవ్రవాద శక్తులు నిధులు సమకూరుస్తున్నాయని నిరాధారంగా ఆరోపించింది. నిబద్ధత, దేశభక్తి కలిగిన రైతుల పోరాటాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం ఇది. వ్యవసాయం, మండీలు, ఆహార పంపిణీపై నియంత్రణను కార్పొరేట్‌ దిగ్గజాలకు అప్పగించడానికి రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల వెనుక మోసపూరిత అజెండాను రైతులు చారిత్రాత్మక ఉద్యమం ద్వారా తిప్పికొట్టారు. ఆ ఉద్యమంపై కేంద్రం చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొడుతూ రైతులు మరోసారి ఐక్యంగా ఉద్యమించారు’ అని ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజూ కృష్ణన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూస్‌క్లిక్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దగ్ధం చేశారు. హర్యానా, పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌, ఇతర రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి.

Spread the love