26న రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి రాక…

26న రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి రాక...– ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్‌ శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి బ్లూ బుక్‌ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పటిష్ఠమైన భధ్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌, బందోబస్త్‌ చేయాలని పోలీసు శాఖకు సూచించారు. పర్యటనలో వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. విద్యుత్‌, అగ్రిమాపక శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సమీక్షలో డీజీపీ రవిగుప్తా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, గవర్నర్‌ కార్యదర్శి బీ వెంకటేశం, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ నాగిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్‌ అలీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love