మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గత సీజన్ కన్నా ఇప్పుడు 10 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా కొనుగోలు చేసినట్టు తెలిపారు. భారత ఆహార సంస్థ ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. ఇదే అంశంపై బుధవారం జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నట్టు చెప్పారు. కొనుగోళ్లు పూర్తి చేసిన 400కు పైగా కేంద్రాలను మూసివేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.