మతోన్మాద కోరల్లో దేశం

– బీజేపీని గద్దెదించాల్సిందే…
– మేడే స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు : తమ్మినేని
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద లక్షల కోట్ల రూపాయల పన్నులు వేస్తూ మోయలేని భారాలు మోపుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇక గద్దె దించాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్‌ కాలనీ అంగడి మైదానంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వారోత్సవాల ముగింపు సభ జరిగింది. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన వహించారు ముందుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్‌ దేవాలయం నుంచి గణేష్‌ చౌక్‌, అంబేద్కర్‌ సెంటర్‌ మీదుగా సుభాష్‌ కాలనీ క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు ప్రజలు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడుతూ… మేడే స్ఫూర్తితో ఉద్యమాలు జరగాలని, శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించాలని అన్నారు. జిల్లా కేంద్రంలో వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని గద్దెనెక్కిందని, ఇపుడు వాటి ఊసే లేదని విమర్శిం చారు. దేశం నేడు మతోన్మాద కోరల్లో చిక్కుకుందన్నారు. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చి పక్కా గహాలు నిర్మించివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ వాగ్దానాన్ని అమలు చేయాలని, ఖాళీ స్థలంఉన్న ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు. మంజూరు చేయాలని కోరారు. అనంతరం మేడే ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్‌, శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొలం రాజేందర్‌, వెలిశెట్టి రాజన్న, చెన్నూరి రమేష్‌, కంపేట రాజన్న, దామెర కిరణ్‌, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఎన్నికల్లో మరోసారి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. దేశంలో మోడీ, అమిత్‌ షా నేతృత్వంలో కార్పొరేట్‌ కంపెనీలకు లక్షలకోట్ల రూపాయలు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అమ్మేస్తున్నారు. మానవాభివృద్ధి ,ఆకలి సూచికలో మన దేశం అట్టడుగు స్థానంలో ఉన్నది. లక్షల కోట్ల నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు ఖాతాలో వేస్తామన్న హామీ అటకెక్కింది. దేశ వినాశనానికి పాల్పడుతున్న బీజేపీని ఓడించాలి.
– తమ్మినేని

Spread the love