రాహుల్‌గాంధీకి ఊరట

ముంబయి: పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. కోర్టు హాజరు నుంచి మినహాయింపునిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముంబయి హైకోర్టు పొడిగించింది. ఆగస్టు 2 వరకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగానూ భాజపాకి చెందిన మహేశ్‌ శ్రీశ్రీమల్‌ 2021లో పరువునష్టం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణకు రాహుల్‌ గాంధీ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎస్‌వీ కొత్వాల్‌ నేతత్వంలోని సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా రాహుల్‌ గాంధీ హాజరు మినహాయింపును ఆగస్టు 2 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే అంశంలో గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువునష్టం దావా వేయడంతో.. సూరత్‌ కోర్టు రాహుల్‌గాంధీని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం.. వెంటనే బెయిల్‌ కూడా మంజూరు చేసింది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రెటేరియేట్‌ రద్దు చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ రాహుల్‌గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్‌ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన తాజాగా గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టాల్సి ఉంది.

Spread the love