కన్నౌజి నుంచి అఖిలేష్‌ యాదవ్‌ నామినేషన్‌

కన్నౌజి: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజి స్థానం సమాజ్‌వాది పార్టీకి కంచుకోటగా నిలిచింది. ఈ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ రిటర్నింగ్‌ కార్యాలయంలో గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కన్నౌజిలో ఎస్పీ చేసిన అభివృద్ధిని బిజెపి ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తుంది. అయితే ఎస్పీ చేసిన అభివృద్ధి ఏంటో కన్నౌజి ప్రజలకు తెలుసు’నని అఖిలేష్‌ అన్నారు. పార్టీ నేతల ఒత్తిడి మేరకే ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన అన్నారు. కాగా, ఇక్కడి నుంచి గతంలో అఖిలేశ్‌ మేనల్లుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అయితే సమాజ్‌వాది పార్టీ కచ్చితంగా గెలిచే స్థానం కనుక ఆ స్థానంలో అఖిలేష్‌ మరోసారి బరిలోకి దిగారు.
ఖలిస్తానీ వేర్పాటువాది లోక్‌సభ ఎన్నికల్లోపోటీ?
అస్సాం జైలులో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్‌ సింగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పంజాబ్‌ రాష్ట్రం ఖాదూర్‌ సాహిత్‌ స్థానం నుంచి అమృతపసాల్‌సింగ్‌ పోటీ చేసే అవకాశాలున్నాయని ఆయన తండ్రి తార్సేమ్‌ సింగ్‌ గురువారం చెప్పారు. మొదట్లో రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా.. బుధవారం న్యాయవాది రజ్‌దేవ్‌ సింగ్‌ ఖల్సా దిబ్రూగఢ్‌ జైలులో అమృతపాల్‌ని కలిసిన తర్వాత పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తార్సేమ్‌ సింగ్‌ అన్నారు. కాగా ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ చీఫ్‌ అమృతపాల్‌ సింగ్‌ను గతేడాది ఏప్రిల్‌ 23న పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద కేసు పెట్టారు.

Spread the love