అవినాశ్ ముందస్తు బెయిల్ పై విచారణ రేపటికి వాయిదా

నవతెలంగాణ – హైదరాబాద్
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకెషన్ బెంచ్ రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇవాళ సాయంత్రం ఈ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు వినిపించడానికి ఎంత సమయం పడుతుందని జడ్జి న్యాయవాదులను అడిగారు. గంట సమయం కావాలని సీబీఐ న్యాయవాదులు పేర్కొన్నారు. దాంతో, వాదనలు రేపు వింటామని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు మాత్రం వెసులుబాటు కల్పించింది. ఆ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 25న వాదనలు వినాలంటూ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Spread the love