బాల సాహిత్యానికి బడులే తావులు…!

బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది బాల సాహిత్యమే. వేల ఏండ్ల కిందటి నుంచే తెలుగు నెలలో మౌఖికం ద్వారా  బాల సాహిత్యం విలసిల్లింది. చాలామంది ప్రాచీన, ఆధునిక కవులు తమ బాల్యం నుండే రచనలు ప్రారంభించారు. పసి హృదయాలలో బాల సాహిత్యం ద్వారానే విజ్ఞాన బీజాలు మొలకెత్తుతాయి. భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. తద్వారా అనేకమంది పిల్లలు తమ ఊహాశక్తికి పదును పెడుతూ రచనలు చేయడం జరుగుతుంది. ఇది బాల సాహిత్యంలో విప్లవాత్మకమైన పరిణామం. ఇదో నూతన వరవడిగా భావించవచ్చు.
బాల సాహిత్య అంశాన్ని బోధించిన తర్వాత ఆ ప్రక్రియకు సంబంధించిన విషయాన్ని సేకరింపజేయడం, రాయమనడం ద్వారా విద్యార్థుల్లో అంశం పట్ల ఆలోచన రేకెత్తించవచ్చు. విద్యార్థులు రాసిన, సేకరించిన అంశాలను ప్రదర్శింప జేయాలి. విద్యార్థులు రాసిన కథలు, కవితలు, గేయాలు, పద్యాలు, నాటికలు, చిత్రాలు, పుస్తక సమీక్షలు వంటి అంశాలను పత్రికలకు పంపడం గానీ, పుస్తక రూపంలో ముద్రితం చేయడం గానీ జరిగినప్పుడు విద్యార్థులు తమ రచనలను చూసి మురిసి పోతారు. మరింతగా ముందుకు వస్తారు.
నేడు మన బడి పిల్లలు కవులుగా, రచయితలుగా పుస్తకాల రూపం లో అచ్చవుతున్నారు. బాల్యం నుండే బాల బాలికలలో బాల సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించినట్లయితే భవిష్యత్తులో మంచి నడవడిక గల పౌరులుగా ఎదుగుతారనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకు గాను పాఠశాలలే బాల సాహిత్యానికి కేంద్ర బిందువులవ్వాలి. బడిని కేంద్రంగా చేసుకొని బాల సాహిత్యం విస్తృతంగా సృజన జరిగి తీరాలి. అందుకుగాను పాఠశాల గ్రంథాలయాలు, బాలసభలు, బాల కవి సమ్మే నాలు ప్రముఖ పాత్ర వహించాలి. అప్పుడే విద్యార్థుల్లో భాషాభిమానం పెరుగుతుంది.
సాహిత్యమే దోహదపడుతుంది
బాల సాహిత్యం రాస్తే ఏమొస్తది? అనే భావన ఇప్పటికీ సమాజంలో, చాలామంది ఉపాధ్యాయులలో నాటుకుని ఉంది. ఇది సరైన భావన కాదు. మంచి సమాజం రాణించాలన్నా, విలువలు గల వ్యక్తులుగా ఎదగాలన్నా బాల సాహిత్యం అందుకు ఎంతగానో దోహదపడుతుంది. బడినే కేంద్రంగా చేసుకొని, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో కృషి జరిగినప్పుడే బాల సాహిత్యం వర్ధిల్లగలదు. అందుచేత పాఠశాలలే వేదికలుగా, పాఠశాల విద్యా కమిటీ, సాహిత్యోపాధ్యా యులు, భాషో పాధ్యాయులు, బాల సాహితీవేత్తలు ముఖ్య భూమిక పోషించాలి.
జ్ఞానాన్ని పెంచే విధంగా పిల్లల కోసం బాల సాహిత్యం ఎలా ఉండాలి? అని ఆలోచించాలి. పిల్లల తరగతి, వారి మానసిక, శారీరక పరిస్థితులు, అవగాహన స్థాయిలను పరిగణలోకి తీసుకుని వారికి జ్ఞానాన్ని పెంచే విధంగా రచనలు సాగాలి. పిల్లలు పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకూడదు. అలా విద్యార్థులను ఉపాధ్యా యులు పరిమితం చేయకూడదు. బాల సాహిత్యంలో ప్రక్రియలకు బొమ్మలు కూడా తగ్గట్టుగా ఉండాలి. భావ సౌందర్యం ఉట్టిపడేలా, పిల్లల హృదయాలు స్పందించేలా రచనలు జరగాలి. కథలు తక్కువ మాటల్లో నిడివి కలిగి ఉండాలి. విరివిగా రాసినంత మాత్రాన బాల సాహితీవేత్తలు కాలేరు. కొత్త ఆలోచనలతో సృజనాత్మకంగా రాసిన వాళ్లే రచయితలుగా నిలబడతారని గ్రహించాలి.
తెలుగు బాల సాహిత్యంలో చక్రపాణిని ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. అతి తక్కువ ధరతో చిన్న పుస్తకాలను ముద్రించి ఆ రోజుల్లో అమ్మేవాడు. అయితే నేటి జనరేషన్‌కు తగ్గ కథలు రాసే రచయితలు తక్కువగా ఉండడం కొంత బాధగానే అనిపిస్తుంది. అవార్డుల కోసమో, పేరు కోసమో రాసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా స్కూళ్లలో పిల్లలు పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అదే మన పాఠశాలల్లో అయితే పాఠ్య పుస్తకాలు, కథల పుస్తకాలు చించుతారని కొన్నిచోట్ల గ్రంథాలయాల్లోని పుస్తకాలు పిల్లలకు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. దయ, కరుణ, ప్రేమ, స్నేహం, కలివిడి స్వభావం, సమానత్వ భావన, ధైర్యం, నిజాయితీ లాంటి మౌలిక భావనలు కథల ద్వారా పిల్లలకు కలగాలి. చివరకు చెడు ఓడిపోతుందని, ధర్మమే గెలుస్తుందన్న భావన రావాలి. ప్రతి పాఠశాలలో డిజిటల్‌ టీవీలు ఉన్నందున యానిమేషన్‌తో కూడిన బాలసాహిత్య ప్రక్రియలను ఆయా చానల్స్‌ ద్వారా పిల్లలకు చూపించగలగాలి. బాల సాహిత్యం వల్ల పిల్లలలో విలువలే కాకుండా, తార్కికశక్తి, ఊహాజనిత శక్తి, శ్రవణ శక్తి, పఠణా నైపుణ్యం కలుగుతాయి. నేటి తరం పిల్లల్లో ఉన్న అనేక మానసిక రుగ్మతలకు బాల సాహిత్యం ఒక రకమైన ధైర్యాన్నిస్తుంది. ఇదంతా మాతృభాష ద్వారానే సాధ్యమని ప్రముఖ భాషావేత్త ”నోమ్‌ చోమ్‌ స్కీ” చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి.
ప్రతిభను వెలికి తీయాలి
విద్య అనేది ఒక జ్ఞాన స్రవంతి. విద్య ద్వారానే విజ్ఞానం సాధ్యమవుతుంది. అందుచేత ప్రతి ప్రక్రియకు, ప్రతి సందర్భానికి, ప్రతి పరిణామానికి గురు శిష్యులే మూలస్తంభాలు. ఈ దిశగా మనం ఆలోచించినప్పుడు అసలు బాలలంటే ఎవరు? పాఠశాలలు బాల సాహిత్యానికి ఏ విధంగా వేదికలుగా దోహద పడుతున్నాయి? అందులో ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉంటుందన్న విషయం పరిశీలించినట్లయితే, ధారణశక్తి, గ్రహణశక్తి ఉండి 18 ఏండ్ల లోపు పిల్లలందరూ బాలలుగా పరిగణించవచ్చు. అట్టి బాలలు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో, సాన్నిత్యంలో అధ్యయనం చేయ పడతారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయబడే వారు ఉపాధ్యాయులు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక రకంగా ప్రతిభా ప్రక్రియ దాగి ఉంటుంది. కాకపోతే వాళ్లలో దాగి ఉన్న అంతర్గత శక్తులను ఉపాధ్యాయులు వెలికి తీయగలగాలి. పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఉండే సృజన నైపుణ్యాన్ని తట్టి లేపాలి.
పిల్లల అభ్యసన అభివృద్ధి కొరకు
వాస్తవానికి తల్లే బాల సాహిత్యా నికి తొలి రూపకర్త. ఆమెనే బాల సాహిత్యాన్ని పలకరించింది. లాలి పాటలు, జోల పాటల ద్వారా తొట్టె లలో తమ పిల్లలకు చిలకరించింది. ఆ తర్వాత భాషావేత్తలు అనేక మంది బాల సాహిత్య రంగంలో కర్తలుగా, సేకర్తలుగా పని చేశారు. చందమామ, జాబిల్లి, బాలమిత్ర, బాల భారతం లాంటి పుస్తకాలు బాల సాహిత్యాన్ని పండించాయి. బాల సాహిత్య వికాసం కొరకు విశేషంగా కృషి చేశాయి. ఆకాశవాణి కూడా ”బాలానందం” పేరిట బాల సాహిత్యాన్ని పరిచయం చేసింది. అంతే కాకుండా బాలల అకాడమీ కూడా అద్భుతమైన కృషి కొనసాగించింది. అదేవిధంగా చాలా సంస్థలు, సాహితీ వేత్తలు, భాషాభిమానులు, ఉపాధ్యాయ లోకం పిల్లల అభ్యసన అభివృద్ధి కొరకు దోహదపడే బాల సాహిత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా బాల సాహిత్యం కొంతమేరకు జిల్లాలవారీగా కృషి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినంక నూతన పాఠ్యపుస్తకాల్లోనూ, హైదరాబాద్‌ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ బాల సాహిత్యానికి పెద్దపీట వేశారు. అయినప్పటికీ బాల సాహిత్యం అనుకున్నంత స్థాయిలో పిల్లలకు చేరువవుత లేదనే విమర్శ కూడా ఉంది. అందుకు పాఠశాలలు, ఉపాధ్యాయులు ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి.
ఓర్పు, నేర్పు ఉండాలి
తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నప్పుడు పాఠ్యాంశాన్ని అన్వయం చేస్తూ సోదాహరణంగా బాల సాహిత్య ప్రక్రియపై అవగాహన కల్పించాలి. అందుకుగాను మొదట ఉపాధ్యాయులకు ఓర్పు, నేర్పు ఉండాలి. అప్పుడే విద్యార్థులకు ఆసక్తి కలుగుతుంది. బాల సాహిత్య అంశాన్ని బోధించిన తర్వాత ఆ ప్రక్రియకు సంబంధించిన విషయాన్ని సేకరింపజేయడం, రాయమనడం ద్వారా విద్యార్థుల్లో అంశం పట్ల ఆలోచన రేకెత్తించవచ్చు. విద్యార్థులు రాసిన, సేకరించిన అంశాలను ప్రదర్శింప జేయాలి. విద్యార్థులు రాసిన కథలు, కవితలు, గేయాలు, పద్యాలు, నాటికలు, చిత్రాలు, పుస్తక సమీక్షలు వంటి అంశా లను పత్రికలకు పంపడం గానీ, పుస్తక రూపంలో ముద్రితం చేయడం గానీ జరిగినప్పుడు విద్యార్థులు తమ రచనలను చూసి మురిసిపోతారు. మరింతగా ముందుకు వస్తారు. బాల సాహిత్యం అన్నప్పుడు భాష పైన, భావం పైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. విద్యార్థుల్లో ఊహాశక్తిని పెంపొందిం చాలి. పూర్తి స్వేచ్ఛనిచ్చి, అవకాశాలు కల్పిస్తే విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు.
సృజన దిశగా కృషి జరగాలి
పిల్లలే స్వతహాగా తమ భావాలని అక్షర రూపంలో వ్యక్తపరిస్తే, ఉపాధ్యాయులుగా వారిని సరైన పద్ధతిలో పయనించేలా చేయడం భాషాభిమానుల, బాషో పాధ్యాయుల ముఖ్యమైన బాధ్యత. బాల సాహిత్యం పరిఢవిల్లాలంటే సాహిత్యాభిమానులైన ఉపాధ్యాయులుంటే సరిపోదు. దానికి తోడు పాఠశాలల్లో ఇతర ఉపాధ్యాయుల సహకారం, ప్రధానో పాధ్యాయుల ప్రోత్సాహం తప్పకుండా ఉండాలి. పాఠశాల గ్రంథాల యంలోని పుస్తకాలు వినియోగించే పద్ధతిలో పాఠశాల ఉండి తీరాలి. కాల నిర్ణయ పట్టికలో లైబ్రరీ పీరియడ్‌ కచ్చితంగా ఉండడమే కాకుండా ప్రతిరోజూ అమలయ్యేలా చూడాలి. పుస్తకాలచే పిల్లలను ఆస్వాదింప చేయాలి. ఆనందింప చేయాలి. సృజన దిశగా పాఠశాల కృషి జరగాలి. బాల సాహిత్య వికాసానికి పాఠశాలలే ముఖ్యమైన తావు లుగా మారాలి. అవి నిరంతరం వికాస కేంద్రాలుగా రూపొందించబడాలి. అప్పుడే బాల సాహిత్యం పట్ల ప్రేరణ కలిగి బాలలకు ఆసక్తి కలుగుద్ది.
(ఈ నెల 24, 25 తేదీలలో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే బాల సాహిత్య సమ్మేళనం సందర్భంగా….)
– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655

Spread the love