బ్రో.. నవ్విస్తుంది ఏడిపిస్తుంది

పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి.సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించిన ఈ సినిమాకి తమన్‌ సంగీతం సమకూర్చారు. ఈనెల 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ ఈవెంట్‌లో వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, ‘ఇది చాలా సంపూర్ణమైన సినిమా. సముద్రఖని రాసిన కథకి త్రివిక్రమ్‌ సరికొత్త స్క్రీన్‌ ప్లే అందించారు. అంతేకాదు ఈ సినిమా సాయి తేజ్‌ చేస్తే బాగుంటుందని త్రివిక్రమే సూచించారు. అందుకే నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. తమన్‌తో ఇది నాకు హ్యాట్రిక్‌ ఫిల్మ్‌. ఈ సినిమాని వేగంగా పూర్తి చేయడానికి కారణం నిర్మాతలు విశ్వప్రసాద్‌, వివేక్‌ల ప్లానింగ్‌. ఈ సినిమా నవ్విస్తుంది, బాధపెడుతుంది. గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం. ఇలాంటి చక్కటి సినిమాని అందించిన సముద్రఖనికి కతజ్ఞతలు’ అని తెలిపారు.

Spread the love