ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ‘కలలకు రెక్కలు’ పధకం ప్రారంభం: చంద్రబాబు

నవతెలంగాణ –  హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం తీసుకువచ్చారు. నేడు ఈ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని తెలిపారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.

Spread the love