– పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని విల్లేమున్స్ చౌరస్తా నుంచి సాయిపూర్ వరకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయి పూర్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు అనేవి మన పిల్లల భవిష్యత్తు పై ఆధారపడి ఉన్నాయని అందరూ గ్రహించాలన్నారు. మతతత్వ పార్టీలు ఓట్లు అడగటానికి వస్తున్నారని మతం పేరుతో గుడి పేరుతో ఓట్లు అడిగే వారికి బుద్ది చెప్పే బాధ్యత ఓటర్లపై ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని, పెదరికం పెరిగిందని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలో సాయిపూర్ అంటేనే తనకు కొండంత బలం అని అన్నారు. నా గెలుపు లో సాయిపూర్ కీలక పాత్ర పోషించదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, ఆరోగ్య శ్రీ లక్ష రూపాయల నుంచి పది లక్షలకు పెంచిన ఘనత రేవంత్ రెడ్డిదేనని తెలిపారు. ఐదు సంవత్సరాలు తాను అందుబాటులో ఉంటా ,సేవ చేస్తానని తనకు ఎంపీగా రంజిత్రెడ్డి తోడైతే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని అన్నారు. కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, వార్డు ఇన్చార్జులు , యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.