ఇండ్లులేని పేదలకు స్థలాలివ్వండి

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శ్రీనివాస్‌
– పేదలతో కలిసి ఆర్డీవోకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సత్తుపల్లి
ఇండ్లులేని పేదలకు ఇండ్లస్థలాలివ్వడంతో పాటో వాటిల్లో డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన ఇండ్లు, ఇంటి స్థలాలులేని పేదలను తీసుకొని కల్లూరులోని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. ఆర్డీవో సమాయానికి లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ తుంబూరు గ్రామంలో సర్వే నెంబరు 34లో 25 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది క్వారీ పేరుతో అక్రమంగా ఆక్రమించుకున్నారన్నారు. సర్వే చేయించి సదరు భూమిని స్వాధీన పర్చుకొని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తిని శ్రీను, గుదే రాము, మామిళ్ల వెంకటేశ్వర్లు, సాంబ, కుమారి, శేషమ్మ, నాగేశ్వరి, మంగారావు పాల్గొన్నారు.

Spread the love