– 11 గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖ కార్యదర్శి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. అదేరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ ఫలితాలు
https://tsbie. cgg.gov.in లేదా http://results. cgg.gov.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 28న ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. గతనెల 19 వరకు అవి జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతనెల నాలుగో తేదీ నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో జరిగింది. బుధవారం ఫలితాలను విడుదల చేస్తున్నారు.