నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపాయో.. ఢిల్లీ నగరంలో అన్ని పాఠశాలలను తెరుస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3లో ప్రభుత్వ పాఠశాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. బీజేపీ ఈ దేశానికి అతిపెద్ద ఉగ్రవాదిగా మారిందన్నారు. కేంద్రం పరిధిలోని అన్ని దర్యాప్తు సంస్థలన్నింటినీ తనపైకి బీజేపీ ప్రభుత్వం ఉసిగొల్పుతుందన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలను సాకారం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించి, పేదరికాన్ని రూపుమాపుతామన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి చాలా అద్భుతమైన పాఠశాలలను ప్రారంభించాము. ఇటీవల అనేక కొత్త పాఠశాలలు ప్రారంభించామని గుర్తు చేశారు. వీటిలో 1.5 లక్షల మంది పిల్లలకు చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు.