ఈ నెల 30న కాంగ్రెస్‌లో చేరుతున్నాం: కేకే

నవతెలంగాణ – హైదరాబాద్: తాము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు, ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన తాము అధికార పార్టీలో చేరుతున్నామని వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నామని కే కేశవరావు కూడా వెల్లడించారు. తాను గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని గుర్తు చేశారు. 84 ఏళ్ల వయస్సులో తాను తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నానన్నారు.
బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా: కేకే తనయుడు
తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగనున్నట్లు కేకే కుమారుడు విప్లవ్ కుమార్ వెల్లడించారు. తన తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. కేసీఆర్‌పై నమ్మకం ఉందన్నారు.

Spread the love