త్రిపురలో 100 శాతానికిపైగా పోలింగ్‌

– రిగ్గింగ్‌కు పాల్పడితేనే ఇలా వందశాతం దాటుతుంది
– రీపోలింగ్‌ నిర్వహించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గంలో, రామ్‌నగర్‌ శాసనసభ స్థానంలో ఈనెల 19న జరిగిన పోలింగ్‌లో వంద శాతంపైగా పోలింగ్‌ జరిగింది. మజ్లిస్‌పూర్‌ సెగ్మెంట్‌లో 105.30 శాతం, ఖాయర్‌పూర్‌లో 100.15 శాతం, మోహన్‌పూర్‌ సెగ్మెంట్‌లో 109.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగలేదని సీపీఐ(ఎం) త్రిపుర శాఖ కార్యదర్శి జితేంద్ర చౌదరి విమర్శించారు. ”పశ్చిమ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికలు, అదే పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన రామ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక స్వేచ్ఛగా, న్యాయంగా, సాధారణ పద్ధతిలో జరగలేదని పైరికార్డులు నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి. బూత్‌లను స్వాధీనం చేసుకున్నప్పుడు, వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తిగా రిగ్గింగ్‌ చేసినప్పుడే ఇటువంటి సరిపోలని పోలింగ్‌ శాతం జరుగుతుంది” అని అన్నారు.
”రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ద్వారా తమ పార్టీకి అందుబాటులో ఉంచిన పోలింగ్‌ స్టేషన్ల వారీగా పోలింగ్‌ రిపోర్టుల నుండి డేటా సేకరించాం. రిటర్నింగ్‌ అధికారికి ప్రిసైడింగ్‌ అధికారి రిపోర్టును అందించే పోలింగ్‌ స్టేషన్ల వారీ డేటా పబ్లిక్‌గా అందుబాటులో లేనప్పటికీ, డిమాండ్‌ను బట్టి దాన్ని యాక్సెస్‌ చేయవచ్చు. అలానే వివరాలు తీసుకున్నాం” అని ఆయన తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు తాజా ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)లు డిమాండ్‌ చేశాయి. పశ్చిమ త్రిపురలో పోలింగ్‌ ముగిసిన కొద్దిసేపటికే లెఫ్ట్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ నారాయణ్‌కర్‌ మాట్లాడుతూ రెండు స్థానాల్లో తాజా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని చెప్పారు. త్రిపుర పశ్చిమ లోక్‌సభ సీటు, రామ్‌నగర్‌ అసెంబ్లీ సీటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో విఫలమవడం, ఎన్నికల సంఘం చేసిన పెద్ద చర్చలు, వాగ్దానాలు చూసి ఆశ్చర్య పోయాం”అని అన్నారు.
పెద్ద ఎత్తున నకిలీ ఓటింగ్‌ను నిరోధించడంలో ఎన్నికల సంఘం విజయవంతమైందని, అయితే గూండాయిజం అదుపు లేకుండా పోయిందని, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాకుండా అడ్డుకు న్నారని కాంగ్రెస్‌ నేత సుదీప్‌ రారు బర్మన్‌ ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి నబెందు భట్టాచార్జీ మాట్లాడుతూ ”మేము డేటాను చూడలేదు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిశీ లిస్తుంది. ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం దానికి కట్టుబడి ఉంటాం” అని అన్నారు.

Spread the love