దుండిగల్ మున్సిపల్ పరిధిలో సుమారు 100
వరకు ప్రయివేటు హాస్టళ్లు
లైసెన్స్ తీసుకున్న దాఖలాలు లేని వైనం
అధికారుల, సిబ్బంది అలసత్యంపై ప్రజలు ఆగ్రహం
సంవత్సరాలుగా మున్సిపల్ ఆదాయానికి కోట్ల
రూపాయల్లో గండి
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఉమ్మడి కుత్బుల్లాపూర్ గ్రామపంచాయతీల స్థలాలకు ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గండి మైసమ్మ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారడం, చుట్టుపక్క ఇండిస్టియల్ తోపాటు ఈ ప్రాంతాలకు ఉపాధి కోసం వచ్చే ప్రజలకు, చుట్టుప్రక్కల అనేక కళాశాలలకు ఈ ప్రాంతం ప్రధాన బిందువుగా ఏర్పాటయింది. ఈ క్రమంలో దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలో వందల సంఖ్యలో విద్యార్థుల కోసం వసతి గహాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఈ హాస్టళ్లు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
కొంత బహుదూర్ పల్లి కాగా, డి పోచంపల్లి, ప్రాంతాల్లో వీధికొక 2 ,,3 హాస్టల్ కనిపిస్తుంటాయి. ఏ ఒక్క హాస్టల్ కు పుర పాలక సంఘం నుంచి వ్యాపార లైసెన్సులు లేవని ఆరోపణలు ఉన్నాయి. వసతి గహాల ఏర్పాటుకు తప్పనిసరిగా మునిసిపల్ వ్యాపార అనుమతులు, సంబంధిత పోలీస్ స్టేషన్ అనుమతులు, ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ హెల్త్ ఇన్స్పెక్టర్ అనుమతులు, ఆ భవనానికి సంబంధించి బిల్డింగ్ నిర్మాణ అనుమతులు ఉండాలి. వేరొకరు నిర్వహిస్తున్నట్లయితే రెంటల్ అగ్రిమెంట్ల అన్ని నిబంధనలలతో నిర్వహించాలి. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. ఏండ్ల తరబడి ప్రతివసతి గహాలకు లైసెన్సులు, రెన్యువళ్లు చేయలేక పోవడంతో ఒక్కో బిల్డింగు గహానికి సుమారు 70 వేల అపరాధ రుసుముతో చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి వసతి గహాలు 100 వరకు దుండిగల్ మున్సిపల్ పరిధిలో ఉండడంతో మున్సిపల్ ఆధాయానికి గండి పడుతోందని విమర్శలు వస్తున్నాయి. వారి వద్ద నుంచి లైసెన్స్ రుసుము వసూలు చేయలేని మున్సిపల్ అధికారుల, సిబ్బంది స్వప్రయోజనాలు అలసత్యంతో కోట్ల రూపాయల ఆదాయం గండి పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చర్యలు చేపట్టి హాస్టల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది తెలియజేస్తున్నారు.
వసతి గహాల యాజమాన్యాలు మాత్రం ఒక భవనంలో ఐదు ఫ్లోర్లు అద్దెలకిస్తూ, దాదాపు రూ. 5,000 వరకు ఒక్కొక్కరి వద్ద వసూలు చేస్తూ ఆ భవనంలో అరకొర వసతులతో ఎటువంటి నిబంధనలు పాటించకుండా, మున్సిపల్ లైసెన్స్ అనుమతులు తీసుకోకపోవడంతో వారి వ్యాపారాలు మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. ప్రజల సౌలభ్యం కోసం మున్సిపాల్టీలు కొత్తగా ఏర్పాటు చేసినా విధులు నిర్వహించే అధికారులు అన్ని విభాగాల్లో లేకపోవడంతో ఏమి చేయలేకపోతున్నామని కొందరు చెబుతూ దాటవేసే ధోరణితో పై అధికారులు వ్యవహరిస్తున్నారు. దుండిగల్ మున్సిపాల్టీ కార్యాలయంలో విధులు నిర్వహించే ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడం, అలాగే ఇతర విభాగాల్లో టౌన్ ప్లానింగ్ బిల్ కలెక్టర్లు అకౌంట్స్ ఇలా అధికారుల సీట్ల ఖాళీ ఏర్పడడంతో సిబ్బంది చర్యలు చేపట్టకపో వడంతో మున్సిపాలిటీ పరిధిలో అనేకచోట్ల నిబంధనలు పాటించని వసతి గృహాలు ఏర్పడుతున్నాయని విమర్శలు అనేకం వస్తున్నాయి.
వసతి గహాలు ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. విద్యార్థుల తీరుతెన్నుపై కూడా తల్లిదండ్రుల బాధ్యత సైతం తీసుకోవాలని. ఇటీవల కొన్ని కొన్ని హాస్టల్లో జరుగుతున్న సంఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.