– గ్లోబల్ లాజిక్ సంస్థను కోరిన ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని స్థాపించాలంటూ అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం కవితతో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ పాల్గొన్నారు. కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యత్ వంటి సౌకర్యాలతోపాటు శాంతి భద్రతల గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నాడు కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ను సందర్శించనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్లో రెండు ప్రాంగణాలున్నాయి. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్లో ఉన్న ఆ కంపెనీలో దాదాపు మూడు వేల మంది పనిచేస్తున్నారు.