– 24లోగా సమాధానమివ్వాలని ఆదేశం
– కేజ్రీకి సత్వర ఉపశమనానికి నిరాకరణ
– 23 వరకు కస్టడీ పొడిగింపు
– కరుడుగట్టిన నేరస్తుడిలా కేజ్రీవాల్ను ట్రీట్ చేస్తున్నారు : పంజాబ్ సీఎం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం స్కాం కేసులో ఈడీకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈనెల 24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 29న విచారణ జరుపనుంది. అయితే మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు సత్వర ఉపశమనం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసు తదుపరి విచారణను వేగవంతం చేయాలని కోరారు. అయితే ఈ నెల 29లోపు విచారణ జరపలేమని కోర్టు తెలిపింది.
ఏప్రిల్ 23 వరకు కస్టడీ పొడిగింపు
ప్రస్తుతం ఉన్న కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. ఈ కేసులో స్పెషల్ జడ్జి కావేరి బవేజా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 23న కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఆయనను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది.
జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేస్తున్నారు : పంజాబ్ సీఎం
అరవింద్ కేజ్రీవాల్ను నేరస్తుడిలా ట్రీట్ చేస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. సోమవారం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను ఆయన కలిశారు. ఒక గ్లాస్వాల్ గుండా ఫోన్లో కేజ్రీతో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరు మాట్లాడుకున్నారు. అనంతరం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కేజ్రీవాల్ని అలా చూసి ఉద్వేగానికి లోనయ్యాను. ఆయనని అక్కడ ఓ కరుడుగట్టిన నేరస్థుడిలా ట్రీట్ చేస్తున్నారు. క్రిమినల్స్కు దక్కే సౌకర్యాలు కూడా ఆయనకు ఇవ్వడం లేదు. ఆయన చేసిన నేరం ఏంటి..? దేశంలోని అతిపెద్ద టెర్రరిస్టుల్లో ఒకరిని పట్టుకున్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు. జైల్లో ఎలా ఉన్నారని తాను అడిగినప్పుడు.. కేజ్రీవాల్ తన గురించి చెప్పలేదని, పంజాబ్ రాష్ట్ర ప్రజల గురించి అడిగారని భగవంత్ మాన్ తెలిపారు. పంజాబ్లో పరిస్థితులు, అభివృద్ధి, ప్రజలకందుతున్న సౌకర్యాల గురించే అడిగారని చెప్పారు. ఆప్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తామంతా కేజ్రీవాల్తో కలిసే ఉంటామని పేర్కొన్నారు.