నవతెలంగాణ-తిరుమలగిరి
దళితబంధులో జరిగిన అవినీతిని ప్రశ్నించి నందుకు మూడు రోజుల కింద తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టిన అఖిలపక్ష నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ అఖిలపక్షకమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తిరుమలగిరి బంద్ విజయవంతమైంది. బంద్ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి అఖిలపక్ష పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్, వైఎస్ఆర్టీపీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీయూఎస్ఐ, తదితర కార్యకర్తలు పట్టణబంద్ నిర్వహించాలని కోరుతూ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. తిరుమలగిరిలో అఖిలపక్ష బంద్ సందర్భంగా వ్యాపారస్తులు తమ వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు బందును విఫలం చేయాలని ఉద్దేశంతో బలవంతంగా కొన్ని షాపులను తెరిపించారు. అయినా ఆ వ్యాపారులు మళ్లీ తమ దుకాణాలను మూసివేశారు. దీంతో అధికార పార్టీ నాయకులు వేసిన ఎత్తుగడ ఫలించలేదు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్మండల కమిటీ అధ్యక్షుడు ఎలిసోజ్ నరేష్, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరు సోమన్న, కందుకూరు శ్రీను, బీజేపీ జిల్లా నాయకులు దీనదయాల్, బహుజన సమాజ్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు మల్లెపాక కృష్ణ, కొండసోమయ్య, మూలవెంకన్న, ఎంపీటీసీ జిమ్మిలాల్,భాస్కర్నాయక్ ఉన్నారు.తిరుమలగిరి పట్టణ బంద్కు ఇద్దరు సీఐలు,10 మందిఎస్సైలు, 50 మంది కానిస్టేబుళ్లతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగారం సీఐ రాజేష్నాయక్తో పాటు తిరుమలగిరి శివకుమార్, తుంగతుర్తి ఎస్ఐ డానియల్తో పాటు పలువురు ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు.