– లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు : ఐఏఎస్ అరవింద్కుమార్కు రేవంత్ రెడ్డి హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టెండర్ వ్యవహారంలో రాజకీయ నాయకుడి మాదిరిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. అడిగిన సమాచారమివ్వకుండా రాజకీయ నాయకుడిగా ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మే25న తనకు ఇచ్చిన లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే, ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు రేవంత్ తన అడ్వకేట్ ద్వారా మంగళవారం రిప్లై ఇచ్చారు. ‘అరవింద్ కుమార్ ఐఏఎస్..మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్గా పలు శాఖల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఏ విధంగా వ్యవహరించాలి. బాధ్యతలను ఎలా నిర్వహించాలి అనే విషయంలో సర్వీస్ రూల్స్ ఉన్నాయి. కానీ అరవింద్ కుమార్ ఆ రూల్స్ పాటించకుండా అడిగిన సమాచారం ఇవ్వకుండా ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ (కండక్ట్) 1968 ప్రకారం..ఐఏఎస్ అధికారి రాజకీయ ఉద్దేశాలు లేకుండా తటస్థంగా వ్యవహరించాలి. కానీ అరవింద్ కుమార్ అధికారి పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు’ అని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ సగం భాగం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా అలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏండ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ కట్టబెట్టారని విమర్శించారు. అంతేకాకుండా ఐఆర్బీ టెండర్ కట్టబెట్టే క్రమంలో అన్ని నిబంధనలు యాధేచ్ఛగా ఉల్లంఘించారని వివరించారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుందనీ, 30 ఏండ్లకు లీజుకు ఇస్తే…2031 తర్వాత మాస్టర్ ప్లాన్ మారుతుందన్నారు. అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెండర్ కూడా 15 నుంచి 20 ఏండ్లకు మించి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎన్హెచ్ఏఐ అభ్యంతరాలను కూడా లెక్క చేయకుండా 30 ఏండ్లకు టెండర్ కట్టబెట్టారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ ఆఫీసరును నియమించి ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతుండగానే హెచ్జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) స్థానంలో హెచ్ఎండీఏను తీసుకొచ్చారని పేర్కొన్నారు. అంతేకాదు ఓఆర్ఆర్ టెండర్కు సంబంధించిన బేస్ప్రైస్ ఎంతో వెల్లడించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి స్పందన లేదని గుర్తు చేశారు. ఓఆర్ఆర్పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్ నివేదికను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదని తెలిపారు. ఇవన్నీ టెండర్ల ప్రక్రియలో ఏదో జరిగిందనే అనుమానాలకు బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా సంబంధిత వ్యవహరంపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని వివరించారు. ఈ క్రమంలో కావాల్సిన సమాచా రాన్ని…ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడానికి వెళ్తుంటే ఒక ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా సచివాల యానికి వెళ్లకుండా అడ్డగించి అరెస్ట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులో తనపై పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమని రేవంత్ పేర్కొన్నారు. అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని తెలిపారు.
కొత్తకోట దయాకర్రెడ్డి మృతికి రేవంత్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండి జనం కోసం పోరాడే నేత దయాకర్ రెడ్డి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.