– బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మత విశ్వాసం అనేది వ్యక్తిగతం అనీ, కానీ మతోన్మాదం ప్రమాదకరమని హెచ్చరించారు. మహాత్మా గాంధీ ఆలోచనా విధానం మనందరికీ అనుసరణీయమని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్హౌస్లో గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన ప్రత్యేక సంచికను డాక్టర్ గున్నా రాజేందర్రెడ్డితో కలిసి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం ప్రతి మనిషి జీవన విధానం కావాలన్నారు. మత సామరస్యం అనేది జాతిని ఒక్క తాటిపై నడిపి స్తుందని చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని సామాజిక మాధ్యమాల్లో కొన్ని రాజకీయ శక్తులు అవమానిస్తున్నాయని, ఇది మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. మత విద్వేషాలను ప్రేరేపించే విధానాలు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకర మంటూ హెచ్చరించారు. మహాత్మా గాంధీ ఆలోచన విధానంపై రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చర్చ పెట్టాల్సిన అవసరముందనీ, ఆ బాధ్యతలను సంస్థ చైర్మెన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి తీసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, పర్యావరణ అంశాలపై గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సంస్థలతో కలిసి చేస్తున్న కృషిని ఆయన అభినందిం చారు. ఈ కార్యక్రమంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు కలీం ఖాన్, ఎం వీ గోనా రెడ్డి, విజరు కుమార్, వాణి, సురేష్ గుప్తా, గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.