ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన ప్రజలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో బుధవారం భూకంపం సంభవించింది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 1:30:23 గంటలకు భూకంపం ప్రభావం కనిపించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ వెల్లడించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇండ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత భూకంప లేఖినిపై 4.8గా నమోదైంది. నేపాల్‌లో ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైనట్టు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నది. ఈ ప్రభావం ఉత్తర ప్రదేశ్‌లో కూడా కనిపించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ వెల్లడించింది. నేపాల్‌లోని బజురలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు భూకంపం సంభవించినట్టు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షక, పరిశోధన కేంద్రం వెల్లడించింది.

Spread the love