దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) నూతన ఆదాయ పంపిణీ విధానంపై అసోసియేట్ సభ్య దేశాలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశాయి. 2024-27 కాలంలో ఐసీసీ ఆదాయంలో బీసీసీఐ 38.5 శాతం అందుకోనుందని సమాచారం. పూర్తి సభ్య దేశాలు (12) ఆదాయంలో 88.81 శాతం పంచుకోనుండగా.. 94 అసోసియేట్ సభ్య దేశాల క్రికెట్ బోర్డులు మిగిలిన ఆదాయాన్ని పొందనున్నాయి. క్రికెట్ సూపర్పవర్ దేశాలకే ఐసీసీ ఆదాయంలో అధిక భాగం దక్కితే.. అసోసియేట్ సభ్య దేశాల్లో క్రికెట్ అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఈ విధానంపై వ్యతిరేకత వ్యక్తం చేయగా.. అసోసియేట్ సభ్య దేశాలు పిసిబి వాదనకు స్వరం పలుకు తున్నాయి. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు మాత్రమే అధిక ఆదాయం దక్కుతుండగా.. మిగతా దేశాలు నామమాత్రపు నిధులు పొందనున్నాయి. జులైలో జరుగనున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నూతన ఆదాయ పంపిణీ విధానంపై ఓటింగ్ జరుగనుంది.