60 ఏళ్ల ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రం: ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ – బంజారా హిల్స్

ఉచిత కరెంట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.  ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ ఆందోళనలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు కవిత, సంగీత, వెంకటేష్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ రైతులకు అవసరమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారన్నారు. వ్యాపారులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలా అని ఆమె రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదన్న వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఆమె రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి విద్యుత్ వ్యవస్థను బాగు చేస్తున్నామని కవిత తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రైతులకు ఏం న్యాయం చేయలేదన్నారు. ఈ రెండు పార్టీల్లో రేవంత్ రెడ్డి పనిచేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ విషయంలో మిగులు రాష్ట్రంగా మారిందని కవిత ప్రస్తావించారు. రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ప్రకటించిన రేవంత్ రెడ్డిని తరిమికొట్టాలని కవిత రైతులను కోరారు.తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బంధు ప్రవేశ పెట్టిన తర్వాత పలు రాష్ట్రాల్లో ఇదే తరహాలో పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆమెతెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా భూగర్భజలాల పెంపు కోసం తమ ప్రభుత్వం కృషి చేసిందని కవిత వివరించారు.

Spread the love