బీఆర్‌ఎస్‌కు బై బై

– వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య
– కుమార్తె దారిలోనే తండ్రి కడియం శ్రీహరి..?
– కాంగ్రెస్‌లో చేరుతారంటున్న గాంధీభవన్‌ వర్గాలు
హైదరాబాద్‌: వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను వరంగల్‌ బరి నుంచి తప్పుకొంటున్నట్టు అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదా లు తెలిపారు.”ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కామ్‌ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడ్డాయి. ఎవరికి వారే అన్నట్టు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. అధినేత కేసీఆర్‌, కార్యకర్తలు నన్ను మన్నించాలి” అని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోకి..ఒకటి రెండు రోజుల్లో కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో చేరికపై కడియం శ్రీహరి ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కారు దిగి..హస్తం గూటికి చేరుతున్న నేతల సంఖ్య పెరగటం పట్ల గులాబీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి కౌంట్‌ డౌన్‌ షురూ అయ్యాక..ఇలాంటి జంపింగ్‌లు పార్టీ పెద్దల్ని కలవరపరుస్తున్నాయి.

Spread the love