– యూటీఎఫ్ ఆధ్వర్యంలో టూకే రన్
నవతెలంగాణ-నల్లగొండ
భారత మహిళా రెజ్లర్లలకు న్యాయం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి అన్నారు. భారత మహిళా రెజ్లింగ్ క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ను పదవి నుండి తొలగిస్తూ అరెస్టు చేయాలనే డిమాండ్తో రెజ్లింగ్ క్రీడాకారులు ఢిల్లీలో నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాల నుండి వివేకానంద విగ్రహం మీదుగా తిరిగి ఎన్జీ కళాశాల వరకు టీిఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.రాజశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో పథకాలు సాధించి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహిళ రెజ్లింగ్ క్రీడాకారులపై లైంగిక దాడి జరిగి వారు ఫిర్యాదు చేసిన దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం భారత మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. పథకాలు తెచ్చినప్పుడు వారితో ఫోటోలు దిగి ట్వీట్లు చేసిన ప్రధానమంత్రి ఆ పతకాలు తెచ్చిన మహిళ రెజ్లింగ్లకు అన్యాయం జరిగితే ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీిఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షురాలు బీ.అరుణ, కోశాధికారి శేఖర్రెడ్డి, జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, నరసింహ, వెంకన్న జిల్లా నాయకులు శ్యామ్, నరసింహ, పీి.సైదులు, కే. సైదులు, కే.రమణ, మధుసూదన్ వివిధ మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.