కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

– ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఐజీ ఆస్పత్రి చైర్మెన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి సీఎంకు కావాల్సిన అన్ని వైద్య పరీక్షలు చేయించారు. సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో సీఎంకు కడుపులో చిన్న పుండు (అల్సర్‌) ఉన్నట్టుగా తేలింది. మందులతో ఆ అల్సర్‌ తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. అల్సర్‌ మినహా మిగతా అన్ని పారామీటర్లు సాధారణంగా(నార్మల్‌)గా ఉన్నట్టు పరీక్షల్లో బయటపడింది. దాంతో అల్సర్‌ తగ్గడానికి అవసరమైన మందులు ప్రారంభించారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రి చైర్మెన్‌ నాగేశ్వర్‌రెడ్డి హెల్త్‌బులిటెన్‌ జారీచేశారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు. సీఎంకు సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ నిర్వహించామనీ, ఆయన గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డారని అందులో పేర్కొన్నారు. అల్సర్‌ ఉన్నట్టుగా పరీక్షల్లో తేలిందని, సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

Spread the love