నేడే టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

– 29,720 మంది ఓటర్లు
– 137 పోలింగ్‌ కేంద్రాలు
– ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌
– అన్ని ఏర్పాట్లు పూర్తి : రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక అలా
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 137 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 126 మెయిన్‌ పోలింగ్‌ స్టేషన్లు, 11 అదనపు పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 29,720 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులు ఇద్దరు ఉన్నారు. 137 పోలింగ్‌ స్టేషన్లలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15 పోలింగ్‌ స్టేషన్లు, నాగర్‌ కర్నూల్‌ 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల్‌ 11, నారాయణ పేట్‌ 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్‌ 18, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి 14, హైదరాబాద్‌ జిల్లాలో 22 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.
ఎన్నికల నిర్వహణకు 739 పోలింగ్‌ సిబ్బంది నియామకం
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 739 పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని నియమించారు. మొత్తం 137 పోలింగ్‌ కేంద్రాలు కాగా ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రానికి 137 పీఓలు, 137 ఏపీఓలు, 319 ఇతర పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. మొత్తం 593 మంది సిబ్బందిని నియమించగా అందులో 146 మంది రిజర్వ్‌గా నియమించారు. అందులో 29 మంది పీఓలు, ఏపీఓలు 30, పోలింగ్‌ పర్సనల్‌ 87 మంది రిజర్వ్‌ గా ఉన్నారు.
డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్‌
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకుని పోవడానికి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు నియమించిన పోలింగ్‌ అధికారులు, సిబ్బంది ఆదివారం ఉదయం 8 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు వచ్చిన మెటిరియల్‌ తీసుకెళ్లారు. రిసెప్షన్‌ సెంటర్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 12 మంది సెక్ట్రోల్‌ అధికారులను నియమించారు. ఈ మేరకు పోలింగ్‌ సిబ్బంది తమ పోలింగ్‌ సామాగ్రితో పాటు వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు.
పోలింగ్‌కు సర్వం సిద్దం : రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక అలా
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక అలా తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్‌ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. స్టాచుచరి, నాన్‌ స్టాచు చరి పత్రాలతో పాటు బ్యాలెట్‌ పేపర్‌, బ్యాలెట్‌ బాక్స్‌, ఓటరు జాబితాను ఎన్నికల సిబ్బంది పరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. 12 సెక్టరోల్‌ అధికారులను, 29 మంది అబ్జర్వర్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద పోలీసు బందోబస్తు, ఓటర్లకు మౌలిక సదుపాయాలు తాగునీరు, టెంట్లు, వికలాంగుల కోసం ర్యాంపులను ఏర్పాటు చేశామని తెలిపారు. రిసెప్షన్‌ సెంటర్‌ను సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Spread the love