సమాజానికి కమ్యూనిస్టులు అవసరం..

– కష్టజీవులకు అండగా ఉండేది వారే…
– తమ్మినేని సూచనతో కౌలు రైతులకు పంట నష్టపరిహారమివ్వాలంటూ సీఎం ఆదేశం: మంత్రి పువ్వాడ అజరుకుమార్‌
– దేశానికి బీజేపీ ప్రమాదమంటూ హెచ్చరిక
– మోడీకి ఒక్క క్షణం పాలించే అర్హత లేదు : తమ్మినేని
– ఖమ్మంలో జనచైతన్య యాత్ర జోష్‌…
ఖమ్మం నుంచి అచ్చిన ప్రశాంత్‌
దేశానికి బీజేపీ రూపంలో తీవ్ర ప్రమాదం పొంచి ఉందనీ, శత్రువును ఐక్యంగా ఎదుర్కోవాల్సిన తరుణం ఆసన్నమైందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ స్పష్టం చేశారు. కార్పొరేట్ల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై దాడిని తీవ్రతరం చేస్తున్న తరుణంలో సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందని ఆయన నొక్కి చెప్పారు. అధికారం ఉన్నా, లేకున్నా కష్టజీవులకు అండగా ఉండేది ఎర్రజెండాయేనని వ్యాఖ్యానించారు. పంటలు దెబ్బతిన్న క్రమంలో నష్టాన్ని అంచనా వేయడానికి ఖమ్మం జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు… సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సాగుదారుల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారనీ, వారికి పంట నష్ట పరిహారం అందేలా చూడాలంటూ సూ చించారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో కౌలు రైతులకు పంట నష్టపరిహారం వెంటనే అందేలా చూడాలంటూ సీఎం ఆదేశించారని తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తలపెట్టిన జనచైతన్య యాత్ర ఏడో రోజైన గురువారం ఖమ్మం నగరానికి చేరింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. నిరంతరం ప్రజల్ని చైతన్యపరుస్తూ కష్టజీవుల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కార్మికుల, కర్షకుల కష్టాలు దగ్గరగా చూస్తూ వారికి న్యాయం చేయాలని కొట్లాడే ఎర్రజెండాల తీరు ఎప్పటికీ ఆదర్శనీయమేనన్నారు. న్యాయం వైపే వారు ఉంటారనేది సహజ సూత్రమన్నారు. ఖమ్మం జిల్లాకు పూర్వ వైభవం రావాలనీ, వామపక్ష పార్టీల నేతలు చట్టసభలకు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు సీఎం కేసీఆర్‌ ఎన్ని సీట్లు ఇచ్చినా తాము దగ్గరుండి గెలిపించుకుంటామని తెలిపారు. ఈ జిల్లాను వామపక్షాలు-బీఆర్‌ఎస్‌ కంచుకోటగా మార్చాలన్నారు. తానూ కష్టజీవులకు అండగా ఉండే కుటుంబం నుంచే వచ్చాననీ, పేదలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలతో ఉన్న ఉద్యోగాలను కోల్పోతున్న దుస్థితి నేడు దేశంలో నెలకొందన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, సహజ వనరులను మోడీ సర్కారు గంపగుత్తగా అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నదని విమర్శించారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ సంస్థలకు వేల కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టిన ఆదానీ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. దేశంలోని ప్రతిపక్షపార్టీల నేతలను వేధించేందుకు ఈడీ, సీబీఐ సంస్థలను బీజేపీ వాడుకుంటున్న తీరును వివరించారు. ఆ పార్టీని వెనక్కి కొట్టేందుకు ఐక్యంగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..మోడీకి దేశాన్ని క్షణం కూడా పరిపాలించే అర్హత లేదన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల చొప్పున తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. అవన్నీ భర్తీ అయితే దేశంలో నిరుద్యోగ సమస్యే ఉండబోదన్నారు. కానీ మోడీ పాలనలో నిరుద్యోగ రేటు గరిష్ట స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపిస్తే విదేశాల నుంచి రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని తెప్పించి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 2022 నాటికి అందరికీ ఇండ్లు కట్టిస్తామనీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ నమ్మబలికిన బీజేపీ… జనాన్ని నిండా ముంచిందని విమర్శించారు. అంబానీ, అదానీలకు మార్కెట్లు, వ్యవసాయాన్ని కట్టబెట్టేందుకు మూడు నల్ల చట్టాలు తెచ్చిందని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఢిల్లీలో రైతులు సుధీర్ఘంగా పోరాటం చేసి ప్రధాని చేత క్షమాపణ చెప్పించారని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెడతానన్న మోడీ ప్రపంచ దేశాల ముందు దేశ గౌరవాన్ని నట్టేన ముంచుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు మతం, కులం, ఆహారపు అలవాట్ల పేరుతో మైనారిటీలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగంపై దాడిని తీవ్రతరం చేసిందనీ, లౌకిక ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలు మనుధర్మాన్నే అసలు సిసలు రాజ్యాంగంగా అమలు చేయాలంటూ చెప్పగా నేడు బీజేపీ ప్రభుత్వం సరిగ్గా దాన్నే అనుసరిస్తోందని తెలిపారు. బీసీ కుల గణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచాలంటూ అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తుంటే బీసీ ప్రధానిగా చెప్పుకునే మోడీ కనీసం ఆ అంశంపై స్పందించడం లేదని విమర్శించారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతల మీద ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని వాపోయారు. వాటిని అడ్డం పెట్టుకుని బీజేపీలో చేరుతారా? జైలుకెళ్తారా? అని బెదిరిస్తున్న తీరును వివరించారు. అసలు ప్రొడక్షనే లేని అదానీ కంపెనీల ద్వారా అతనికి రూ.17 లక్షల కోట్ల ఆదాయం ఎలా పెరిగిందంటూ తమ్మినేని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆయనపై విచారణ ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. మునుగోడులో బీజేపీ ఓటమి కమ్యూనిస్టుల వల్లనే సాధ్యమైందనీ, భవిష్యత్తులోనూ ఆ పార్టీని అడ్డుకుంటామని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ..మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని దేశం నుంచి పారదోలటమే తమ లక్ష్యమన్నారు. వాల్‌మార్టు, డీమార్టు రాకతో ఖమ్మం నగరంలో చిరువ్యాపారులు, దుకాణదారులు జీవనోపాధిని కోల్పోతున్న క్రమాన్ని వివరించారు. మార్కెట్‌ వ్యవస్థ అంబానీ, అదానీ చేతుల్లోకి వెళ్తే సామాన్యులు బతకడమే కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సభలో జనచైతన్య యాత్ర బృంద నాయకుడు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, మల్లు లక్ష్మి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్‌, కోట రమేశ్‌, యర్రా శ్రీకాంత్‌, సీపీఐ, సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Spread the love