జన విస్పోటనం

జనాభా పెరుగుదల వలన కలిగే దుష్ఫరిణామాలను అవగతం చేసుకున్న ఐక్యరాజ్యసమితి దశాబ్దాల క్రితమే కార్యాచరణ ప్రారంభించింది. పలు ప్రపంచ దేశాలు సైతం చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ప్రపంచ ప్రజల, ప్రభుత్వాల ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే ఫలితం శూన్యం. కాబట్టి జనాభా పెరుగుదల వలన కలిగే విపత్కర పరిణామాలపై ప్రజల్లో నిరంతర చైతన్యం కలిగించాలి. జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా…
కొన్ని దేశాల్లో జనాభా పెరిగింది. కొన్ని దేశాల్లో జన సంఖ్య తగ్గుముఖం పట్టింది. వద్ధుల సంఖ్య పెరిగి, యువ జనాభా తగ్గడం కూడా ఆందోళన కలిగించే విషయమే. తక్కువ భూభాగం కలిగి ఎక్కువ జనాభాతో బాధపడే దేశాలు అభివృద్ధిని సాధించలేవు. అధిక జనాభాతో బాధపడే దేశాల్లోని ప్రజలకు అన్ని సదుపాయాలూ కల్పించడం కష్టం. ఈ కారణంగానే చాలా దేశాలు వెనకబడే ఉంటున్నాయి. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వాలు, ప్రజలు అర్ధం చేసుకోవాలి. జనాభాను తగ్గించుకుని, పేదరికాన్ని పారదోలాలి. లింగ వివక్షతను రూపు మాపి, సమానత్వాన్ని, మానవత్వాన్ని మెరుగు పరచి మానవ హక్కులను కాపాడాలి. 1989లో యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యు.ఎన్‌.డి.పి) నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వాల్లో కదలిక రావాలి. 800 కోట్లకు చేరువలోనున్న ప్రపంచ జనాభాకు అన్ని వసతులు సమకూర్చవలసిన బాధ్యత వాటిపై ఎంతైనా ఉంది.
ఇప్పటికే అడవులను, పచ్చని భూములను ధ్వంసం చేసి, పర్యావరణాన్ని నాశనం చేసేశారు. దాని ఫలితాలను ప్రజలు చవిచూస్తున్నారు. సరైన వసతి లేదు. ఆహార భద్రత లేదు. విద్యా వైద్య సదుపాయాలు గగన కుసుమంలా మారాయి. ఆధునిక ప్రపంచంలో చాలా గ్రామాల్లో తాగునీరు లేక వ్యాధుల బారిన పడుతున్నారు. నగరాలన్నీ మురికి కూపాలుగా మారిపోతున్నాయి. కుటుంబ పోషణార్ధం బాలలు వెట్టిచాకిరీ వైపు పయనిస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థ పురుడు పోసుకోవడానికి ఆర్థిక లేమి కారణమౌతున్నది. విద్యా సౌకర్యాలు లేక, పట్టించుకునే వారు కరువై వీధి బాలలుగా మారే వారి సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో పెరిగే అవకాశముంది. జనాభా పెరుగుదల వలన కలిగే దుష్ఫరిణామాలను అవగతం చేసుకున్న ఐక్యరాజ్యసమితి దశాబ్దాల క్రితమే కార్యాచరణ ప్రారంభించింది. పలు ప్రపంచ దేశాలు సైతం చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ప్రపంచ ప్రజల, ప్రభుత్వాల ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే ఫలితం శూన్యం. కాబట్టి జనాభా పెరుగుదల వలన కలిగే విపత్కర పరిణామాలపై ప్రజల్లో నిరంతర చైతన్యం కలిగించాలి.
చైనా జనాభా కొద్ది దశాబ్దాల్లో గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతుండటంతో చైనా వన్‌ చైల్డ్‌ విధానానికి వీడ్కోలు చెప్పింది. ఇద్దరు పిల్లలను కనేందుకు జంటలకు అనుమతి ఇచ్చింది. ఇస్లామిక్‌ విప్లవం తర్వాత ఇరాన్‌లో జనాభా విస్ఫోటనం జరిగింది. కాని ప్రస్తుతం జనాభా తగ్గుముఖం పడుతున్నది. ఇటలీ జనాభా తరిగిపోయి, వృద్ధులు పెరిగిపోతున్నారు. జపాన్‌ జనాభాలో సగం మంది వృద్ధులు వుండే అవకాశాలున్నాయి. భారత జనాభా చైనాను అధిగమించేసింది. జన విస్ఫోటనం మధ్య మానవాళి ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆహార, ఆవాస, తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ప్రపంచమంతా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రపంచ దేశాలన్నీ నిర్దిష్టమైన ప్రణాళిక, కార్యాచరణతో సమిష్టితత్వంతో ముందుకు సాగాలి.
ఆర్థికాభివృద్ధి కేవలం భౌతికమైన సహజ వనరులపైనే గాక మానవ వనరుల మీద కూడా ఆధారపడుతుంది. దేశంలోని జనాభా, వారి విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, విధానాలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ మొదలైన వాటిని మానవ వనరులుగా చెప్పవచ్చు. జనాభా పెరుగుదల రేటు కొన్ని దేశాల ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తుందని తెలుస్తుంది.

జనాభా పరిమాణం బట్టి జనాభా 3 రకాలు
1. అల్ప జనాభా- ఒక దేశ విస్తీర్ణతకు సరిపోని జనాభాను అల్పజనాభా అంటారు. ఇలాంటి దేశాల్లో మానవ వనరుల కొరత ఏర్పడి ఆర్థికాభివృద్ధి మందగిస్తుంది.
ఉదా: రష్యా, ఆస్ట్రేలియా, అరబ్‌దేశాలు
2. అభిలషణీయ జనాభా- ఒక దేశానికి సరిపడే జనాభాను అభిలషణీయ జనాభా అంటారు. అభిలషణీయ జనాభా ఉన్నట్లయితే ఆ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుంది.
ఉదా: అభివద్ధి చెందిన దేశాలు
3. అధిక జనాభా- ఒక దేశ భూభాగం కన్నా జనాభా ఎక్కువగా ఉంటే దానిని అధిక జనాభాగా పేర్కొనవచ్చు. ఫలితంగా ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగిత ఏర్పడుతుంది. దీనిలో మానవ వనరులు వృథా అవుతాయి.
ఉదా: భారతదేశం, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మొదలైన అభివృద్ధి చెందుతున్న దేశాలు.
స్త్రీ, పురుష నిష్పత్తి
ప్రస్తుతం చాలా దేశాల్లో స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాని అభివృద్ధి చెందిన దేశాలలో ఇందుకు భిన్నంగా ఉన్నది. ప్రతి 1000 మంది పురుషులకు రష్యాలో 1070 మంది స్త్రీలు ఉన్నారు.
– అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా భారతదేశంలో 1901 సంవత్సరంలో స్త్రీ-పురుష జనాభా నిష్పత్తి 972: 1000 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 943: 1000 ఉంది.
-పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో ప్రతి 1000మంది పురుషులకు 1022 మంది స్త్రీల సంఖ్య ఉంది. 2001లో 1058 కి, 2011లో 1084 కు పెరిగింది. జనాభా అక్షరాస్యత- మనదేశ జనాభాలో అక్షరాస్యుల శాతం 1951 నుంచి క్రమంగా పెరుగుతున్నది. కేవలం 20శాతం మాత్రమే అక్షరాస్యులుగా ఉన్న జనాభా 2011 నాటికి 64.84శాతానికి పెరగగా 2011 నాటికి 73శాతానికి పెరిగింది.
-2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యులున్న రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 94మంది అక్షరాస్యులు ఉన్నారు.
-మనదేశంలో 1951 నాటికి స్త్రీల అక్షరాస్యత 2.8శాతం ఉండగా పురుషుల అక్షరాస్యత 29శాతంగా ఉంది.
-2011 నాటికి స్త్రీల అక్షరాస్యత రేటు 64.6శాతం కాగా పురుషుల అక్షరాస్యత రేటు 80.9 శాతానికి పెరిగింది.
-మొత్తం జనాభాలో పురుషుల కంటే స్త్రీలు విద్యలో వెనుకబడినట్లు తెలుస్తున్నది. ఇందుకు మనదేశంలోని మత, సాంఘిక, ఆర్థిక పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
చైనాను దాటేశాం..
ఐక్యరాజ్య సమితి స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ 2023 పేరుతో జనాభా లెక్కలను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారతదేశ జనాభానే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. జనాభాలో చైనాను దాటిన భారత్‌.. అత్యధిక జనాభా కలిగిన దేశంగా టాప్‌ ప్లేస్‌ లో నిల్చింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లు ఉంటే.. భారత్‌ జనాభా 142.86 కోట్లకు చేరుకుంది. అయితే, భారత్‌.. చైనా జనాభాను ఎప్పుడు దాటిందో మాత్రం స్పష్టం చేయలేదు.
ఐక్యరాజ్య సమితి బుధవారం విడుదల చేసిన లెక్కల్లో.. ఈ ఏడాది మధ్యలోనే 29 లక్షల జనాభాతో భారత్‌ చైనాను అధిగమించినట్లు తెలిపింది. అయితే, గతంలో ఎన్నడూ భారత్‌ చైనా జనాభాను అధిగమించలేదు. జనాభా పరంగా భారత్‌, చైనా దేశాల తర్వాత 340 మిలియన్ల జనాభాతో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా మూడో స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడించింది.
– అనంతోజు మోహనకృష్ణ,
8897765417

Spread the love